MLAs Purchase: సిట్‌కు జవాబులు చెప్పకుండా ఏడ్చేసిన ప్రతాప్‌!

26 Nov, 2022 03:37 IST|Sakshi

సందేశాలు, చాటింగ్‌పై ప్రశ్నలు

నేడు కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు 

తెలియదు, గుర్తులేదంటూ దాటేసిన చిత్రలేఖ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని 41–ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అంబర్‌పేటకు చెందిన న్యాయ వాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్, నిందితుడు నందుకుమార్‌ భార్య చిత్రలేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్‌ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ గౌడ్‌కు మధ్య పలు ఫోన్‌ సందేశాలు, వాట్సాప్‌ చాటింగ్, కాల్‌ రికార్డ్‌లను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాసించలేదని, మెసేజ్‌లు చేయ లేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసు లు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ప్రతాప్‌ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా జవాబు చెప్పకుండా దాటే శారు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా లాభం లేకపోవటంతో శనివారం కూడా విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఆయన్ను ఆదేశించారు. 

సోమవారం మరోసారి రండి..: నందు భార్య చిత్రలేఖను విచారించిన సిట్‌ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఆమెకు, ప్రతాప్‌ గౌడ్, నందుకు మధ్య పలు ఫోన్‌ కాల్స్, వాట్సాప్‌ సందేశాలు బయటపడ్డాయి. ఆయా మెసేజ్‌లలో ఏ సమాచా రం ఉందని? ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్‌ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి, వారెవరు? ఎందుకొచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురించి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటంతో, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరిగి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. 

హైకోర్టు ఆదేశించినా శ్రీనివాస్‌ గైర్హాజరు: శుక్రవారం సిట్‌ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు. కరీంనగర్‌ న్యాయవాది శ్రీనివాస్‌ను ఈ కేసులో ఏ–7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్‌ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: మల్లారెడ్డి కేసులో​ ట్విస్ట్‌.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్‌!

మరిన్ని వార్తలు