పత్రికలు పంచి వస్తూ మూర్ఛతో మృతి

4 Aug, 2021 07:52 IST|Sakshi

గుత్తి రూరల్‌: యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన శివశంకర్‌ ప్రసాద్‌రెడ్డి మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన  ఓ యువతితో ఈ నెల 13వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గుత్తిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు వచ్చాడు. పత్రికలు ఇచ్చి అందరినీ ఆహ్వానించిన అనంతరం స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఎంగిలిబండ శివారుకు చేరుకోగానే మూర్ఛ రావడంతో శివశంకర్‌ రోడ్డు పక్కకు వాహనం ఆపేసి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు అతడు కోలుకునేందుకు సపర్యలు చేయగా.. శివశంకర్‌ ఆలోపే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఏర్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది.

మరిన్ని వార్తలు