ఊపిరి పోసిన తల్లి.. ఆయువు తీశాడు

17 Dec, 2020 08:09 IST|Sakshi

సాక్షి, రుద్రూర్‌(నిజామాబాద్‌) : తాగుడుకు బానిసైన ఓ కుమారుడు కిరాతకానికి ఒడిగట్టాడు. నవమాసాలు మోసి కన్న తల్లినే పొట్టనపెట్టుకున్నాడు. డబ్బుల కోసం ఆమెను వేధించి, గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం అంబం (ఆర్‌) గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిలపల్లి సాయవ్వ (65)కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు చిన్న సాయిలు దుర్వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. దీంతో ఆయన భార్య గౌరవ్వ కూతురు, కుమారుడ్ని తీసుకుని ఐదేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి వద్ద ఉంటున్న సాయిలు డబ్బుల కోసం ఆమెను తరచూ వేధించేవాడు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..!

నిత్యం మద్యం తాగి వచ్చి తల్లితో పాటు గ్రామస్తులతోనూ ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా తల్లితో గొడవ పడి ఆమెపై చేయి చేసుకున్నాడు. తెల్లవారేసరికి ఆమె విగతజీవిగా పడి ఉంది. అయితే, తనకేమీ తెలియనట్టుగా తల్లి చనిపోయిందని బంధువులకు చెప్పాడు. అయితే, సాయిలే సాయవ్వను గొంతు నులిమి చంపాడంటూ అతడి వదిన అనుషవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొంతు నులమినట్టుగా ఉందని నిర్ధారణకు వచి్చన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు