Bhopal Mass Suicide: అప్పిచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబం మొత్తం..!

29 Nov, 2021 16:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అప్పుల వేధింపులు తట్టుకోలేక గత గురువారం విషంతాగి మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసందే. ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి కూడా సోమవారం ఉదయం మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని పిపలానీ ప్రాంతానికి చెందిన సంజీవ్‌ జోషి (47), అతని తల్లి నందిని (67), భార్య అర్చన (45), వారి సంతానం గ్రీష్మ (21), పూర్వి (16) కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని నవంబర్‌ 25 (గురువారం) రాత్రి సేవించారు. ఆటోమొబైల్‌ విడిభాగాల దుఖానం నడిపే జోషి వాట్సాప్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో తమ మరణాలకు కారణమైనవారి పేర్లను తెలుపుతూ కుటుంబంగా విషంతీసుకోవడాన్ని వీడియో తీసి వాట్సప్‌లో పంపించాడు. సూసైడ్‌నోట్‌ను ఇంటి గోడపై అంటించారు కూడా. ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా సూసైట్‌ నోట్‌లను వాట్సప్‌లో పంపారు. సైంటిస్ట్‌ అవ్వడం తన కలని ఒకరు, ఫ్యాషన్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించాలనుకున్నట్లు మరొకరు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. తమ కలలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయని కూడా నోట్‌లో తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా.. వేర్వేరు సమయాల్లో కుటుంబం మొత్తం మృతి చెందారని ఒక పోలీస్‌ అధికారి స్థానిక మీడియాకు తెలియజేశారు. 

కాగా ఈ కేసు విచారణలో అప్పులిచ్చిన వారిలో నలుగురు మహిళలను అరెస్ట్‌ చేసినట్లు, మిగిలిన వారినికూడా అదుపులోకి తీసుకుంటామని ఏఎస్పీ రాజేష్‌ సింగ్‌ భదౌరియా మీడియాకు తెలిపారు.

చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!

మరిన్ని వార్తలు