కరోనా టెస్ట్‌ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష

4 Feb, 2022 10:49 IST|Sakshi

కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక  ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్‌ కలెక్షన్‌ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో.. పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్‌లో పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్‌ సమయంలో ఆమె పనిచేసే మాల్‌లో పాతిక మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్‌తో కలిసి ఆమె సైతం పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్‌ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్‌కు రావాలంటూ సదరు ల్యాబ్‌టెక్నీషియన్‌(నిందితుడు) ఆ యువతి రప్పించుకున్నాడు. స్వాబ్‌ సేకరణలో భాగంగా ఈసారి శాంపిల్‌ సేకరణ ప్రైవేట్‌ పార్ట్‌ నుంచి చేయాలని చెప్పి.. నీచంగా ప్రవర్తించాడు.

 

అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్‌ను సంప్రదించగా.. కొవిడ్‌-19 స్వాబ్‌ టెస్ట్‌ ముక్కు, నోటి నుంచి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితుడిని అరెస్ట్‌ చేయకపోవడంతో పెద్ద ఎత్తున్న నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. 

సుమారు పదిహేడు నెలల విచారణ తర్వాత.. అమరావతి జిల్లా కోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్‌ల 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.

మరిన్ని వార్తలు