అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌రేప్‌ కేసు: నలుగురికి బెయిల్‌.. ఎమ్మెల్యే కొడుక్కి మాత్రం నో!

27 Jul, 2022 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ మైనర్‌ సామూహిక అత్యాచార కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు 48 రోజుల తర్వాత..  అమ్నీషియా పబ్‌ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్‌ మంజూరు చేసింది జువైనల్‌ జస్టిస్‌ బోర్డు.

జూబ్లీ హిల్స్ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు మైనర్లకు  మంగళవారం బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్‌ బోర్డు. ఇదిలా ఉంటే.. మైనర్ల బెయిల్‌ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది జువైనల్‌ బోర్డు. అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్‌ను రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఆదేశించింది. 

ఎమ్మెల్యే కొడుకు ఇంకా.. 
అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్‌ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక ఈ కేసులో మరో మైనర్‌ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ దొరకలేదు. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో..  హైకోర్టులో బెయిల్‌ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. ఇంకా జువైనల్‌ హోంలోనే ఉండాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు