భార్యను దూషించాడని మిత్రుడిపై కత్తితో దాడి

3 Aug, 2021 07:53 IST|Sakshi

అనంతపురం క్రైం: భార్యను దూషించాడనే కోపంతో స్నేహితుడిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం అనంతపురంలోని పాతూరు బంగారు వీధిలో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన మేరకు...  మునిదేవ్‌ అలియాస్‌ దేవా, వెంకటేశ్‌ స్నేహితులు. దేవా 20 ఏళ్లుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నాడు. మూడు నెలల కిందటే అనంతపురానికి వచ్చాడు. వెంకటేశ్‌ టీవీ టవర్‌ వద్ద నివాసముంటున్నాడు.  వీరిద్దరూ బంగారు వీధిలో దుకాణాల ముందు రోజు చెత్తాచెదారాన్ని ఊడ్చుతూ జీవనం సాగించే వారు.

పని ముగించుకుని దేవా బంగారు వీధిలోనే నిద్రించేవాడు. ఏరోజుకారోజు వచ్చిన డబ్బుతో మద్యం సేవించేవారు.  ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో వెంకటేశ్‌ భార్యను దేవా తిట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్‌ తన వద్ద ఉన్న కత్తితో దేవాపై దాడి చేశాడు. దేవా శరీరంలో ఏడు చోట్ల కత్తి గాయాలయ్యాయి. కుడివైపు గొంతులో లోతుగా గాయమైంది. క్షతగాత్రుడిని పోలీసులు, స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. కాగా, దేవాను అంబులెన్స్‌ ఎక్కించే సమయంలో వెంకటేశ్‌ అక్కడే ఉంటూ సాయపడడం గమనార్హం.   

మరిన్ని వార్తలు