డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం

28 Oct, 2020 10:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన డెంటల్‌ డాక్టర్‌ హుస్సేన్ కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ హుస్సేన్ అకౌంట్‌లో పెద్ద మొత్తంలో నగదు ఉందని అతడి బంధువు ముస్తఫా తెలుసుకున్నాడు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన ముస్తఫా డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలని ప్లాన్‌ చేశాడు. ప్లాన్‌ అమలులో భాగంగా కిడ్నాప్‌ చేసేందుకు కొంతమందిని మాట్లాడుకొని హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేశారు. అనంతరం కిడ్నాపర్లు డబ్బుల కోసం హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు వాట్సాప్‌ కాల్‌ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్‌కాయిన్‌ రూపంలో కావాలని డిమాండ్‌ చేశారు.

మొబైల్‌ నంబర్‌ ఆధారంగా వెహికల్‌ని ట్రేస్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్‌ అయిన ఏపీ పోలీసులు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ నిర్వహించగా.. అనంతపురం జిల్లా తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్‌ చేసి డాక్టర్‌ హుస్సేన్‌ను రక్షించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    (డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌)

కిడ్నాప్‌ ఉదంతాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం డాక్టర్ హుస్సేన్ కిడ్నాపయ్యారు. రాత్రయినా హుస్సేన్ ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లు అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం ఎస్పీ సత్యయేసుబాబుకు కిడ్నాపర్ల కదలికలపై సమాచారమిచ్చారు. దీంతో అనంతపురం ఎస్పీ జిల్లాలోని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేశారు.

చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తపోవనం దగ్గర ఓ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన పోలీసులు దానిని వెంబడించారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద పోలీసులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్‌ చేసి డాక్టర్‌ హుస్సేన్‌ను రక్షించారు. కిడ్నాపర్ల వద్ద నుంచి రివాల్వర్‌, కత్తి, మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రాప్తాడు సీఐ మాట్లాడుతూ.. రూ.10 కోట్ల కోసం డాక్టర్‌ హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేశారు. డబ్బు ఇవ్వాలని లేదంటే చంపుతామని కిడ్నాపర్లు బెదిరించారు. హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసిన అనంతరం బెంగళూరుకు తరలిస్తుండగా కిడ్నాపర్లను పట్టుకున్నారు​.

మరిన్ని వార్తలు