నిత్య పెళ్లికూతురు మాయలెన్నో..!

14 Jun, 2021 08:05 IST|Sakshi
కిలాడీ లేడీ సుహాసిని

వరుస పెళ్లిళ్లు..రూ.లక్షల్లో మోసాలు

వెలుగులోకి వచ్చిన కిలాడీ లీలలు 

తిరుపతి క్రైమ్‌: తిరుపతిలో చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసు మరో మలుపు తిరిగింది. సుహాసిని వల్ల తాను నష్టపోయానంటూ ఆమె రెండో భర్త వినయ్‌ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వినయ్‌కు 2018లో సుహాసిని పరిచయమైంది. తాను అనాథనని, ప్రేమించానని చెప్పడంతో 2019లో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయినట్లు వాపోయాడు. పెళ్లి చేసుకొన్న కొన్ని రోజులకే ఆమె ప్రవర్తన సరిగా లేకపోగా.. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి డబ్బులు తీసుకోవడాన్ని గమనించానని తెలిపాడు. మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఆమె ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిపించి బంధువులుగా పరిచయం చేసిందన్నాడు.

తన బంధువుల దగ్గర నుంచి తీసుకొచి్చన రూ.10 లక్షలతో పాటు తన ఇంట్లో సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారంతో రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిందని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో ఆమె మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాడు. తిరుపతిలో మూడో పెళ్లి విషయం వెలుగులోకి రావడంతో మీడియా ముందుకు వచ్చానని వినయ్‌ తెలిపాడు. ఆమె మొదటి భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఈ మోసాలకు పాల్పడుతోందని, ఆమెను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరాడు.

తిరుపతిలో వెలుగులోకి లీలలు.. 
అలిపిరి ఎస్‌ఐ పరమేశ్‌నాయక్‌ కథనం మేరకు.. జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (29) ఐదేళ్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తూ తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసే ఎం.సుహాసిని (35)తో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథనని చెప్పడంతో యువకుడు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. ‘నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందు అప్పులు చేశాను’ అంటూ ఆమె యువకుడి నుంచి రూ.4 లక్షలు,  అతని తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుంది.

ఇది తెలిసి యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించగా, ఇంట్లో యువతి ఆధార్‌కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా.. నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ఈలోగా సుహాసిని ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా.. త్వరలో నీ డబ్బులిచ్చేస్తా. పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలనూ యువకుడికి పంపింది. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.

చదవండి: క్రికెట్‌ బెట్టింగ్‌: మైనర్లు కాదు..ముదుర్లు! 
గుంటూరులో సైకో వీరంగం

మరిన్ని వార్తలు