పెళ్లి రద్దు.. అమెరికాలో ఏపీ యువతి ఆత్మహత్య

4 Mar, 2021 22:58 IST|Sakshi

చిత్తూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన పెళ్లి అకస్మాత్తుగా రద్దవడంతో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరగాల్సిన రోజే ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఆమె మరణంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం అలుముకుంది. రెండు రోజుల్లో ఆమె మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే పెళ్లి ఎందుకు రద్దయ్యింది? దానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు.

చిత్తూరుకు చెందిన ప్రసాద్ నాయుడు కుమార్తె సుష్మ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండేది. ఆమెకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్‌తో వివాహం నిశ్చయమైంది. మార్చి 4వ తేదీకి ముహూర్తం నిర్ణయించారు. అయితే భరత్ కుటుంబీకులు వివాహానికి ససేమిరా అన్నాడు. దీంతో వివాహం రద్దయ్యింది. అకస్మాత్తుగా పెళ్లి రద్దు కావడంతో సుష్మ మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో అదే బాధతో డల్లాస్‌లోని తన నివాసంలో సుష్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారంతో చిత్తూరులో ఉన్న కుటుంబసభ్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. సుష్మ మృతితో కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే సుష్మ మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది. వివాహం రద్దు చేసుకున్న భరత్ కుటుంబసభ్యులపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు