Hyderabad: కానిస్టేబుల్ నిర్వాకం.. యువతితో 4 ఏళ్ల ప్రేమ.. బర్త్‌డే పేరుతో!

7 Jan, 2023 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్‌ కానిస్టేబుల్‌ యువతిని మోసం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్‌.ఎస్‌ మక్తాకు చెందిన యువతికి కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఎ.నిఖిల్‌ (27)తో 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం తన పుట్టిన రోజు అని చెప్పి యువతిని బయటకు తీసుకెళ్లాడు. మాయమాటలతో నమ్మించి ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిశాడు. అప్పటి నుంచి యువతిని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు.

వివాహం చేసుకోమని యువతి డిమాండ్ చేసిన ప్రతిసారి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో యువతి ఆరా తీయగా మరో యువతితో నిఖిల్‌కు సంబంధం ఉందని తెలిసింది. అప్పటి నుంచి బాధితురాలు నిఖిల్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. రెండున్నర నెలల క్రితం తన ఇంటికి రావాలని మాట్లాడుకుందామని చెప్పడంతో యువతి నమ్మి వెళ్లింది. ఇంట్లోనే యువతిపై కానిస్టేబుల్‌ అఘాయిత్యానికి పాల్పడంతో యువతి గర్భం దాల్చింది.

దీంతో తననుపెళ్లి చేసుకోవాలని అడగ్గా కానిస్టేబుల్‌ అందుకు నిరాకరించాడు. తాను పోలీస్‌నని తనను ఎవరూ ఏమి చేయలేరని బెదిరించాడు. దీంతో బాధితురాలు షీ టీంను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న నిఖిల్‌ బాధితురాలి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం ఇప్పుడే వద్దంటూ కొన్ని మాత్రలు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని అడగగా ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు