పెళ్లిరోజే కబళించిన మృత్యువు

20 Nov, 2020 08:32 IST|Sakshi
అమరేశ్వరరావు (ఫైల్‌) 

రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం 

కన్నీరుమున్నీరవుతున్న భార్య, కుటుంబ సభ్యులు 

మరో ఆరు రోజుల్లో సోదరుడి వివాహం 

సాక్షి, అవనిగడ్డ: పెళ్లిరోజు నాడే దంపతులపై విధి వక్రించి వారిద్దరినీ వేరు చేసింది. బంధువుల ఇంట హాయిగా ఆనందంగా గడుపుదామనుకున్న వారి ఆశల్ని చిదిమేసింది. కుటుంబ సభ్యులతో కలసి వెళుతున్న ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని లారీ మృత్యువు రూపంలో వెంటాడి భర్తను బలితీసుకోగా, కుమార్తెకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.  

పోలీసుల కథనం ప్రకారం..  
విజయవాడకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కేశాని అమరేశ్వరరావు (32) ఘంటసాల మండలం చిట్టూర్పు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో భార్య లావణ్యకు, కుమార్తె భవిష్యకు గాయాలు కాగా ఏడాదిన్న కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మొవ్వ మండలం గూడపాడుకు చెందిన అమరేశ్వరరావు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తమామల దగ్గర నుంచి బయలుదేరి స్వగ్రామమైన మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ఘటనలో అమరేశ్వరరావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ గాయాలపాలైన భార్య లావణ్య, కుమార్తె భవిష్యను ఆస్పత్రికి తరలించారు. కాగా  కుమార్తె  పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. (స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. సోన్‌పాపిడి డబ్బా..)

వివాహమైన రోజే... 
సుమారు ఐదేళ్లు క్రితం ఇదే రోజు అమరేశ్వరరావు, లావణ్యల వివాహమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భార్య లావణ్యలు కుమార్తె భవిష్య, ఏడాదిన్నర కుమారుడు తనీష్‌తో కలసి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. సోదరుడి వివాహం మరో ఆరు రోజుల్లో జరగాల్సి ఉంది. సంఘటనా స్థలంలో భార్య, పిల్లలు విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టించింది. గూడపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు