కేంద్ర మంత్రి నివాసం సమీపంలోని బ్యాంక్‌లో భారీ చోరి..

10 Jun, 2021 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బిహార్‌ హెచ్‌డీఎఫ్‌సీ శాఖలో భారీ చోరి

కేంద్ర మంత్రి నివాసం సమీపంలో చోటు చేసుకున్న ఘటన

పట్నా: బిహార్‌లో దొంగలు పట్టపగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అది కూడా కేంద్ర మంత్రి నివాసం పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కోటి రూపాయలకు పైగా దోచుకెళ్లారు దొంగలు. బిహార్‌ హాజీపూర్‌లోని జదుహా బ్రాంచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన దాని ప్రకారం.. జదుహాలో కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్ నివాసం సమీపంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌ను గురువారం ఉదయం తెరిచారు. 

ఈ క్రమంలో  మధ్యాహ్నం సమయంలో బైక్‌ మీద వచ్చిన కొందరు దుండగులు బ్యాక్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలను బయటకు తీసి.. ఉద్యోగులను బెదిరించి.. క్యాష్‌ రూమ్‌ నుంచి డబ్బు తీసుకురమ్మని.. లేకపోతే.. చంపేస్తామని హెచ్చరించారు. అలా తెచ్చిన 1.19 కోట్ల రూపాయలను బస్తాల్లో నింపుకుని.. అక్కడ నుంచి పారిపోయారు. దొంగలు డబ్బు సంచులను తమ భుజం మీద మోసుకెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది. 

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఐదుగురిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపాడు. దానిలో భాగంగా సరిహద్దులు మూసి వేశామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. రెండు నెలల క్రితం కూకట్‌పల్లి విజయ్‌నగర్‌ కాలనీలోని ఏటీఎం కేంద్రం వద్ద దుండగులు ఓ సెక్యూరిటీ గార్డ్‌ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

చదవండి: కూకట్‌పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!

మరిన్ని వార్తలు