గర్భిణీ భార్యను చూసేందుకు సెలవు పెట్టి వచ్చిన జవాన్.. నక్సల్స్ చేతిలో..

27 Feb, 2023 18:55 IST|Sakshi

రాయ్‌పూర్‌: గర్భిణీ భార్యను చూసేందుకు సెలవులు పెట్టి ఇంటికి వచ్చిన ఓ జవాన్‌ మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌ కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. జవాన్ మృతితో అతని భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ జవాన్‌ వయసు 29 ఏళ్లు. గర్భిణీ భార్యను చూసేందుకు వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వచ్చాడు. షాపింగ్ చేసేందుకు శనివారం సాయంత్రం గ్రామంలోని మార్కెట్‌కు వెళ్లిన అతడిపై ఇద్దరు మావోయిస్టులు దాడి చేశారు. అతి దగ్గరకు వెళ్లి తుపాకీతో తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. జవాన్ సోదరుడితో పాటు గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే సాధారణంగా మవోయిస్టులు ఆ‍ర్మీ జవాన్లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంత అధికారి తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ లేదా ఇతర సెక్యూరిటీ సంస్థలకు చెందిన జవాన్లపై మాత్రం తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆర్మీ జవాన్‌ను ఇలా హత్య చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ అనుకునే ఇతడిపై దాడి చేసి ఉంటారని పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో గత వారంలోనే ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
చదవండి: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు..

మరిన్ని వార్తలు