ఘరానా దొంగ! విమానంలో వచ్చి మరీ చైన్‌స్నాచింగ్‌...

31 Mar, 2022 07:58 IST|Sakshi

హిమాయత్‌నగర/శంషాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతని పేరు హేమంత్‌కుమార్‌ గుప్త (30).. ఢిల్లీలో నివాసముంటున్నాడు. విమానంలో హైదరాబాద్‌కు వచ్చి చైన్‌స్నాచింగ్‌ చేసి తిరిగి విమానంలోనే ఢిల్లీ వెళ్లడం అతడి తీరు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పి. కమల (55) పుస్తెలతాడును లాక్కొని వెళ్లాడు. పుస్తెలతాడు లాగుతున్న సమయంలో కిందపడ్డ ఆమె తలకు బలమైన గాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కదలికలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు.

ఎయిర్‌పోర్టువైపు వచ్చినట్లు తెలియడంతో  ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టులోని కానిస్టేబుళ్లు శ్రీశైలం, భాను, లింగం విమానాశ్రయంలోని భద్రతాధికారులతో కలిసి అన్ని విమానాల్లో క్షుణంగా తనిఖీలు చేశారు. బుధవారం తెల్లవారు జామున 5.45 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.

గతంలో ఇలాంటి తరహాలోనే ఆరు స్నాచింగ్‌లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రాచకొండ పోలీసులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు కానిస్టేబుళ్లను శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఓఎల్‌ఎక్స్‌లోచూసి ఎల్‌బీనగర్‌కు చెందిన వ్యక్తినుంచి మంగళవారం ద్విచక్రవాహనం కొనుగోలు చేసి అదే వాహనాన్ని వాడి స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. 

(చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు)

మరిన్ని వార్తలు