సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని ఓ హోర్డింగ్ వెనుక దాచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన విజిలేష్ కుమార్(30) రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కాచిగూడలోని లియో సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్గా చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 7లోని ఫోర్ వీల్స్ ట్రావెల్స్కు చెందిన పార్కింగ్ స్థలంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. సమీపంలో ఖాళీ స్థలంలో దుర్వాసనలు వస్తున్నాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహారీని ఆనుకొని ఓ హోర్డింగ్ కనిపించింది.
హోర్డింగ్ వెనుకాల కుళ్ళిపోయిన స్థితిలో విజిలేష్ మృతదేహం కనిపించింది. అతడిని హత్య చేసిన దుండగులు ఎవరికీ కనిపించకుండా హోర్డింగ్ వెనుకాల మృతదేహాన్ని దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 13 నుంచి విజిలేష్ ఉద్యోగానికి వెళ్ళడం లేదని తెలుస్తోంది.