దారుణం: తిట్టవద్దని వారించినందుకు వ్యక్తిపై దాడి..మృతి!

3 May, 2021 16:59 IST|Sakshi

నెల్లూరు: జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తాగి దారిన పోయేవారిని తిట్టవద్దన్నందుకు ఓ వ్యక్తి  పై మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంట లో మే1వ తేదీన జరిగిన దాడి లో తీవ్రగాయాల పాలైన అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఉండే జి.దిలీప్ తప్ప తాగి దారిన పోయే స్థానికులను దూషించేవాడు. స్థానికంగా ఉండే  అన్నపు రెడ్డి వెంకటేశ్వర్లు అలా తిట్టకూడదని  వారించడంతో, అతనిపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిలీప్, చక్రి, ప్రభు, యాలయ్య, ఆశా మురళి,  కార్తీక్, ప్రకాష్ తో మరికొంత మంది  కలిసి కొండాయపాలెం గేట్ పక్కనే ఉన్న అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లు పై కత్తులు, రాడ్లు, కర్రలతో ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇంట్లో మహిళలు,చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అన్నపు రెడ్డి వేంకటేశ్వర్లునీ కత్తులతో పొడిచి,రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అతణ్ణి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా,  చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4గంటలకు మరణించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని  సీపీఎం జిల్లా సెక్రటరి  మాదాల వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

చదవండి:పనివాడే నిందితుడు

మరిన్ని వార్తలు