బీచ్‌లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి..

11 Mar, 2022 17:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం)/కృష్ణా జిల్లా: ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన విద్యార్థినిపై మరొక వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. బందరు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. మరో కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇరువురు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి బందరు మండలం చినకరగ్రహారం శివారు పల్లెపాలెం సమీపంలోని బీచ్‌కు వెళ్లారు.

చదవండి: వివాహేతర సంబంధం: వద్దన్నా వినకుండా.. ఆమె ఇంటివద్దకెళ్లి..

బీచ్‌ ఒడ్డున ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటుండగా కరగ్రహారానికి చెందిన యర్రంశెట్టి మణిదీప్, పోసిన నాగబాబు వారి వద్దకు వెళ్లారు. ప్రియుడిని మణిదీప్‌ తాళ్లతో కట్టివేయగా పోసిన నాగబాబు విద్యార్థినిని బలవంతంగా తోటలోకి లాక్కెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం వారు ఇరువురిని వదిలేశారు. జరిగిన ఘోరాన్ని తలచుకుంటూ ప్రేమికులిద్దరూ ఇంటికి వెళ్లారు.  ప్రేమికులు ఇద్దరు వారి పెద్దలకు చెప్పకుండా గురువారం రాత్రి  బందరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు