దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు

4 Jul, 2021 10:56 IST|Sakshi
ఇటీవల బృందావనం కాలనీలో హత్యకు గురైన తల్లీకూతుర్లు

సాక్షి, మంచిర్యాలక్రైం: నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం క్షణికావేశంలో అయిన వారినే కడతేరుస్తున్నారు. అనుమానంతో ఒకరు.. వివాహేతర సంబంధంతో మరొకరు.. పాత కక్షలతో ఇంకొకరు... ప్రేమ వ్యవహారంలో మరొకరు... ఇలా కారణాలు ఏవైనా కావచ్చు ఇలా చంపేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో గతనెల 18 నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో నాలుగు హత్యలు జరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. జిల్లాలో నేర ప్రవృత్తి పెరుగుతోందనడానికి ఈ ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
హత్యోదంతాల్లో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కుటుంబాన్ని పోషించే తండ్రి, కన్నవారిని చూసుకునే తల్లి, కడవరకు కష్టాలు, కన్నీళ్లలో తోడుంటానని బాసలు చేసిన ప్రేమికుడు చివరకు చిన్నచిన్న పొరపాట్లతో క్షణికావేశానికిలోనై హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చిన్నచిన్న సమస్యలకే క్షణికావేశంలో చేసిన పొరపాటు వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. 

అవగాహనలేకనే హత్యలు
చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లే హత్యలు జరుగుతున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అధికంగా వివాహేతర సంబం«ధాలు, భూసమస్యలు, పాతకక్షలు, మద్యం మత్తులో క్షణికావేశంలో జరిగే హత్యలు అనేకం. పోలీస్‌స్టేషన్‌ను     ఆశ్రయిస్తే సమస్య సులువుగానే పరిష్కారం అవుతుంది. 

– ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీసీపీ, మంచిర్యాల 

పకడ్బందీగా చట్టాలు అమలు
చట్టాలు చాలా పకడ్బందీగా అమలవుతున్నాయి. నేరం చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు. నేరాలు పెరగడానికి కారణం మానవ విలువలు కోల్పోవడం. మనిషిలో అహం, బంధుత్వ విలువలు కోల్పోవడంతో స్వార్ధం పెరిగింది. మనుషుల్లో విలువలు పెరగాలి. 

– పులి రాయమల్లు, న్యాయవాది, మంచిర్యాల

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు

గత నెల 18న జిల్లా కేంద్రంలోని బృందవన్‌ కాలనీకి చెందిన పూదారి విజయలక్ష్మి, రవినాల జంటహత్యలు సంచలనం సృష్టించింది. రవినా భర్త నిజామాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అరుణ్‌కుమార్‌పై   వరకట్నం కేసు నమోదైంది. తన భార్య కాపురానికి రాకుండా అత్త విజయలక్ష్మి అడ్డుపడడమే కాకుండా అబార్షన్‌ చేయించిందన్న కోపంతో ఇరువురిని కిరాయి ముఠాతో హత్య చేయించాడు. 

 ఈ నెల1న జైపూర్‌ మండలం నర్సింగపూర్‌ గ్రామానికి చెందిన కాతం లింగయ్య తన భార్య లక్ష్మికి మంత్రాలు వస్తాయన్న అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు.

 ఈ నెల 3న జిల్లా కేంద్రంలోని సాయికుంట లో నివాసం ఉంటున్న కొప్పుల నాగరాజు (39)ను వివాహేతర సంబంధం పెట్టుకొని కు టుంబాన్ని పట్టించుకోవడం లేదని అతని భార్య స్వరూప హత్య చేసి పోలీసులకు     లొంగిపోయిన సంఘటన సంచలనం సృష్టించింది. 

క్షణికావేశంలో....

 గతేడాది జూన్‌2న మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి మండలంలోని రంగంపేటకు చెందిన దాగం సురేందర్‌ తన ప్రహారి గోడకు ప్లాస్టింగ్‌ చేయిస్తుండగా చల్లూరి దుర్గయ్య తన భూమిలోకి వచ్చి పనులు చేసుకోవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో సురేందర్‌ దుర్గయ్య తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడు.

► కట్టుకున్న భార్యను, పిల్లలను పట్టించుకోవడంలేదని గతేడాది జూన్‌ 11న కన్నతండ్రినే కుమారుడు గొడ్డలితో నరికి చంపిన ఘటన మంచిర్యాల జిల్లా రాపల్లి స్టేజివద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌(40) అతని కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. 

చదవండి: సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి రూ.94 లక్షలు మాయం.. ట్వీస్ట్‌ ఎంటంటే..

మరిన్ని వార్తలు