నమ్మించి ఏటీఎం కార్డు మార్చాడు..

15 Jun, 2021 09:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కేసముద్రం(వరంగల్‌): ఓ వ్యక్తి ఏటీఎం కార్డును నమ్మించి తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి రూ.24వేలను అపహరించిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో సోమవారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం విలేజ్‌కి చెందిన బొల్లోజు జనార్దనాచారి శనివారం మండల కేంద్రంలోని ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లాడు. అప్పటికే ఓ గుర్తుతెలియని వ్యక్తి మాస్క్‌ ధరించి లోపలికి వచ్చాడు. డబ్బులు రావడం లేదా అంటూ జనార్దనాచారిని ఆరా తీశాక ఏటీఎం కార్డు తీసుకుని పిన్‌ నంబర్‌ను తెలుసుకున్నాడు.

ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తి తనవద్ద ఉన్న ఏటీఎంకార్డుతో డబ్బులు వస్తాయో చూస్తానని నమ్మించి, మరోసారి ప్రయత్నం చేశాడు. అప్పటికి డబ్బు రాలేదు. తన కార్డు తనకు ఇవ్వమని జనార్దనాచారి అడగగా మరో కార్డు ఇచ్చేసి వెళ్లిపోయాడు. తీరా జనార్దనాచారి ఇంటికి వెళ్లాక సెల్‌ఫోన్‌కు డబ్బు డ్రా అవుతున్నట్లుగా మెసేజ్‌లు వస్తుండటంతో, పరీక్షించగా కార్డు మారినట్లు గుర్తించాడు. అప్పటికే ఆయన ఖాతా నుంచి 6సార్లు మొత్తం రూ.24వేలు డ్రా అయ్యాయి. దీంతో ఏటీఎం కార్డును బ్లాక్‌ చేయించి బ్యాంకు అధికారులతో పాటు సోమవారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై రమేష్‌బాబును వివరణ కోరగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.  

చదవండి: విషాదం: తమ్ముడిని కాల్చి చంపి.. తను ఆత్మహత్య

మరిన్ని వార్తలు