పెళ్లి చేసుకోమని కోరితే ప్రాణాలు తీశాడు

10 Nov, 2020 04:48 IST|Sakshi
నజీమా బేగం(ఫైల్‌)

2018లో జరిగిన ఘోరం పోలీసుల విచారణతో వెలుగులోకి..  

నిందితుడిని కఠినంగా శిక్షించాలని ‘స్పందన’లో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

గుంటూరు: తనను నమ్మి వచ్చిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరినందుకు దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి కాల్చి, ఆనవాళ్లు లేకుండా చేశాడు. 2018 జూన్‌లో జరిగిన ఈ దారుణం పోలీసుల విచారణలో తాజాగా వెలుగు చూసింది. మృతురాలి తండ్రి షేక్‌ కరిముల్లా తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు అల్లీనగర్‌కు చెందిన షేక్‌ కరీమ్‌ అలియాస్‌ నాగూర్‌.. కరిముల్లా కుమార్తె నజీమాబేగం(28)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు.

ఈ క్రమంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి 2018 మే 25న నజీమాబేగం ఇంటి నుంచి వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో అదే ఏడాది జూన్‌ 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నెల 4వ తేదీన రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను బాలిక బంధువులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ఘోరం బయటపడింది.  

ముక్కలుగా నరికి.. ఆనవాళ్లు దొరక్కుండా
ఇంటి నుంచి వెళ్లిన అనంతరం నజీమాబేగం, నాగూర్‌లు ఓ గదిలో మూడు వారాలకు పైగా కలిసి ఉన్నారు. అనంతరం ఆమె 2018 జూన్‌ 21న పెళ్లి ప్రస్తావన తేవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నజీమాను గోడకేసి కొట్టడంతో ఆమె ఆక్కడికక్కడే మృతి చెందింది.  ఆమె రెండు కాళ్లను కత్తితో నరికి గోతాములో కట్టి అర్ధరాత్రి మృతదేహాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి పెట్రోలు పోసి దహనం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైందని యువతి తండ్రి కరిముల్లా కన్నీటిపర్యంతమయ్యాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోమవారం ‘స్పందన’లో గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు