టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో..

18 Feb, 2021 09:22 IST|Sakshi
బాధితురాలు కురుబ లక్ష్మిదేవి - చేరదీసిన పెద్దన్న ఉలిగన్న

అంధురాలైన చెల్లెలిపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేసిన అన్న

కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఓ అన్న చెల్లెలిపైనే దాడిచేసి ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని బాలవెంకటాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన కురుబ లక్ష్మీదేవి పుట్టుకతోనే అంధురాలు. ఈమెకు ముగ్గురు అన్నలు. ఆమె మూడో అన్న తిప్పేస్వామి వద్ద ఉంటోంది. ఈ నెల 13న పంచాయతీ ఎన్నికల్లో ఆమె పెద్దన్న ఉలిగన్న సాయంతో ఓటు వేసింది.

రాత్రి సమయంలో టీడీపీ కార్యకర్తలైన తిప్పేస్వామి, అతని కుటుంబ సభ్యులు నువ్వు టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్‌సీపీకి వేశావంటూ దుర్భాషలాడుతూ లక్ష్మీదేవిపై దాడిచేసి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఆత్మహత్య చేసుకుంటానన్న ఆమెను ఉలిగన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. విషయం సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో బుధవారం ఉదయం కూడా తిప్పేస్వామి కుటుంబ సభ్యులు మరోసారి ఆమెపై దాడికి పాల్పడ్డారు.
చదవండి: కానిస్టేబుల్‌ పాడు పనులు.. 
అమ్మో పాము.. యువతి వాహనంపై వెళ్తుండగా..

మరిన్ని వార్తలు