భూ మాయగాళ్లు..

5 Nov, 2020 09:13 IST|Sakshi
సృష్టించిన తప్పుడు డ్యాకుమెంట్, తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని కొనుగోలు చేసిన వారు

తప్పుడు డాక్యుమెంట్‌తో 5 ఎకరాల  రిజిస్ట్రేషన్‌కు యత్నం 

చివరి క్షణంలో గుర్తించి వెనక్కి పంపిన అధికారులు  

కేఎంసీ పరిధిలోని విలువైన ఖాళీ భూములు, స్థలాలపై మాఫియా కన్ను

ఆందోళనలో యజమానులు 

కర్నూలు(సెంట్రల్‌): భూమాయగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో అధికారుల అప్రమత్తతతో విలువైన భూమి అక్రమార్కుల పాలుగాకుండా నిలబడింది. కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మునగాలపాడు గ్రామ రెవెన్యూలో 154, 155 సర్వే నంబర్లలో బుధవారపేటకు చెందిన గిరిజనులు చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు, పెద్ద వీరన్నకు 4 ఎకరాలు, గిడ్డయ్యకు 4 ఎకరాలు, చిన్న పాపన్నకు 3 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దాదాపు ఎకరా రూ.కోటికి పైగా విలువ ఉంది. చిన్న పుల్లయ్యకు చెందిన 5 ఎకరాల భూమిపై వడ్డెగేరి సూర శ్రీనివాస్‌ గౌడ్, అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌ ఏరియాకు చెందిన పి.బాలచంద్రారెడ్డి, మునగాలపాడు మణిబాబు, కింగ్‌మార్కెట్‌ మేకల దాసరి ప్రకాష్, ప్రకాష్‌నగర్‌ ఎన్నం రాజశేఖరరెడ్డి కన్ను పడింది. ఎలాగైనా భూమి దక్కించుకోవాలని షేక్‌ హైదర్‌అలీ, షేక్‌ అబ్బాస్‌అలీ, షేక్‌ ఉమ్రాన్‌ అలీ, షేక్‌ షరీఫ్‌బాషా, షేక్‌ జాఫర్, షేక్‌ ఖాదీర్, షేక్‌ హుస్సేన్, షేక్‌ అçఫ్సర్‌ హుస్సేన్, షేక్‌ ఖాజా బాషా, షేక్‌ ఖాజా బాషాల పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. వారి నుంచి తాము కొనుగోలు చేస్తున్నట్లు డాక్యుమెంట్‌ సృష్టించి కర్నూలు సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్నంగా పరిశీలించగా తప్పుడు డాక్యుమెంట్‌ అని తేలడంతో రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారు.  

నిరంతరం ఇదే పనిలో భూబకాసురులు 
కర్నూలు మునిసిపల్‌కార్పొరేషన్‌ పరిధిలో భూమి విలువ కోట్లకు పెరగడంతో కొందరు భూబకాసురులు ముఠాలుగా ఏర్పడ్డారు. మొదట ఖాళీ స్థలాలను గుర్తించి దొంగ డ్యాకుమెంట్లు సృష్టించి వాటి ద్వారా అధికారులను మభ్యపెట్టి తప్పుడు రిజి్రస్టేషన్లతో స్వాధీనం చేసుకుంటున్నారు.ఆతర్వాత నిజమైన లబ్ధిదారులకు విషయం చేరేలా చూస్తారు. తమకు రిజి్రస్టే షన్‌ ఉందని దౌర్జన్యం చేస్తారు. చివరకు పంచాయితీ పేరుతో సగం–సగం అంటూ పంచుకోవడానికి సిద్ధ పడతారు. అలా పంచుకోవడానికి నిజమైన యజమానులు ముందుకు రాకపోతే కోర్టు లో కేసు వేసి ఏళ్లకు ఏళ్లు తిప్పుతారు. ఇలాంటి ముఠా ఎత్తుగడ ను ఇటీవల రిజిస్ట్రేషన్‌ కార్యాలయ అధికారులు చిత్తు చేశారు.  

కలిసొస్తున్న పోలీసుల ఉదాసీనత... 
భూమాఫియాగాళ్లకు పోలీసుల ఉదాసీన వైఖరి కలిసొస్తోంది. భూకబ్జాలకు పాల్పడే వారిపై నిజమైన యజమానులు ప్రారంభంలోనే ఒక్కోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఇది సివిల్‌ పంచాయితీ అంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో యజమానులు అంతా తెలుసుకునేలోపే కబ్జాదారులు తప్పు డు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటూ కోర్టుకు వెళ్తున్నారు. ఇక కొందరు రిజి్రస్టేషన్‌ అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి కబ్జాదారుల పక్షమే వహిస్తూ రిజిస్ట్రేషన్‌ చేసి యజమానులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమని అడిగితే డాక్యుమెంట్లు చూసి చేశామని,మరీ కొంచెం ఒత్తిడి చేస్తే పనిలో పడి సరిగా చూసుకోలేదని చెబుతున్నారు.  

మా భూములకు రక్షణ లేకుండా పోయింది 
మాకు మునగాలపాడు సమీపంలో సర్వే నంబర్లు 154, 155లలో మొత్తం 20 ఎకరాల భూమి ఉంది. ఇందులో మాన్నాన్న చిన్న పుల్లన్నకు 8 ఎకరాలు భూమి ఉంది. అందులో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. మిగతా 15 ఎకరాలకు కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారేమోనని భయంగా ఉంది. భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– మనీష్‌, భూ యజమాని, కర్నూలు 

తప్పుడు డాక్యుమెంట్‌గా గుర్తించి తిరస్కరించాం 
మునగాలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని 154, 155 సర్వే నంబర్లలోని 20 ఎకరాల్లో 5 ఎకరాలకు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చారు. అయితే చివరి క్షణంలో మాకు అనుమానం వచ్చి తీక్షణంగా పరిశీలించాం. తప్పుడు డాక్యుమెంట్లుగా గుర్తించి తిరస్కరించాం. విషయాన్ని నిజమైన వారసులకు తెలిపాం. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.
– నాగభూషణం, జిల్లా రిజిస్ట్రార్‌, కర్నూలు  

మరిన్ని వార్తలు