జైపూర్‌లో ఆడి కారు బీభత్సం

6 Nov, 2020 19:00 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ఉదయం ఆడి కారు బీభత్సం సృష్టించింది.రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు వేగంగా ఢీకొట్టడంతో ఫ్లైఓవర్‌పై నుంచి కింద ఉన్న ఒక బిల్డింగ్‌ టాప్‌రూఫ్‌పై ఎగిరిపడ్డాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కారు వేగంగా నడిపి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'రాజస్తాన్‌లోని పాలి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మాదా రామ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు ప్రిపేరవుతున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం మాదా రామ్‌ జైపూర్‌ వచ్చాడు. ఉదయం 8గంటల ప్రాంతంలో మాదా రామ్‌ జైపూర్‌లోని సోడాలా ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్‌ రోడ్డును దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫ్లైఓవర్‌పై వేగంగా వస్తున్న ఆడి కారు అదుపు తప్పి మాదారామ్‌ను బలంగా ఢీకొట్టింది.

దీంతో మాదా రామ్‌ ఫ్లైఓవర్‌పై నుంచి పక్కన ఉన్న బిల్డింగ్‌ రూఫ్‌టాప్‌ మీదకు ఎగిరిపడ్డాడు. గాయాలు బలంగా తగలడంతో ఆ వ్యక్తి‌ అక్కడికక్కడే మరణించాడని' తెలిపారు. కారును వేగంగా నడిపిన నేహా సోని అనే మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా మాదారామ్‌ కుటుంబసభ్యులు జైపూర్‌కు చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు