అత్తామామల చేతిలో అల్లుడు హతం 

18 Jun, 2021 14:13 IST|Sakshi

తాడేపల్లి రూరల్‌(గుంటూరు జిల్లా): మండల పరిధిలోని నులకపేటలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ భర్త భార్యను చితకబాది, రోడ్డుమీదకు లాక్కొచ్చి వివస్త్రను చేసి కిలోమీటరు దూరంలో ఉన్న అత్తమామ ఇంటివరకు లాక్కెళ్లాడు. అది తట్టుకోలేని అత్త మామలు అల్లుడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన కృష్ణ–రోహిణి దంపతుల పెద్ద కుమారుడైన కడలూరి నరేష్‌ (31)కు నులకపేటకు చెందిన దుర్గారావు–కమల దంపతుల పెద్దకుమార్తె లావణ్యతో వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు. నరేష్‌ పెళ్లయిన రెండేళ్ల తర్వాత లావణ్య తల్లితో అసహ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో మూడేళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం 2017లో మరోసారి అదేవిధంగా ప్రవర్తించడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండవ కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ  క్రమంలోనే భార్యను హింసిస్తూ అత్తమామల చేతిలో హతమయ్యాడు.  సీఐ శేషగిరిరావు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నరేష్‌కు విజయవాడలోని బ్లేడ్‌బ్యాచ్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నగర బహిష్కరణకు గురైన సందీప్‌ అలియాస్‌ పెద్ద బాండ్‌ అనుచరుడిగా తిరుగుతున్నాడు. పెద్దబాండ్‌ను నగర బహిష్కరణ చేసిన తరువాత నులకపేట ప్రాంతంలోకి తీసుకువచ్చి ఇల్లు ఇప్పించింది కూడా నరేషే అని స్థానికులు చెబుతున్నారు.

చదవండి: ఏపీ: కర్ఫ్యూ వేళల సడలింపు    
మావోయిస్టుల మృతదేహాలను14 కి.మీ. మోసుకుంటూ..

మరిన్ని వార్తలు