మహిళ పీక కోసిన ఆటో డ్రైవర్‌

3 Jan, 2021 16:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నోయిడా: తనకు అడ్వాన్స్‌గా ఇవ్వలేదనే కోపంతో ఓ ఆటో డ్రైవర్‌ ప్రయాణికురాలి పీక కోశాడు. గొంతు మీద లోతైన గాయం కావడంతో ఆమెకు మాటలు కూడా రావడం లేదు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజాంఘర్‌కు చెందిన శివనాథ్‌ ఆటో డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఓ మహిళ తనను ఆఫీసుకు తీసుకెళ్లమని కోరింది. అయితే ముందుగా అడ్వాన్స్‌ డబ్బులివ్వంటూ ఆమెను దబాయించాడు. (చదవండి: భార్యభర్తల గొడవలో బలైన మూడేళ్ల చిన్నారి!)

దీనికి ఆమె ససేమీరా అనడంతో కోపంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్‌ ఆమె పీకను అడ్డంగా కోసి అక్కడ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో మాట్లాడటానికి కూడా గొంతు పెగల్లేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ నుంచి సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కానీ ఇంకా మాట్లాడలేకపోతుందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘాతుకానికి పాల్పడ్డ శివనాథ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించారు. (చదవండి: 100కు ఫోన్‌ చేసి ప్రధానికి బెదిరింపు)

>
మరిన్ని వార్తలు