ఈ పాపం ఎవరిది.. ప్రాణం ఉండగానే పసికందు పూడ్చివేత?

10 Jul, 2021 09:02 IST|Sakshi

సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ ): అమ్మ గర్భగుడి దాటిన ఓ పసిపాపకు లోకం శాపం విసిరింది. ఏ వైద్యుడు పరీక్షించాడో, ఏమని రిపోర్టు ఇచ్చాడో గానీ కళ్లయినా తెరవని బుజ్జాయిని కొన ప్రాణంతో ఉండగానే కాటికి పంపించేశారు. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పాపాయిని గుడ్డ ముక్కలతో చుట్టి మట్టిలో పాతి పెట్టాలని పురమాయించారు. పలాసలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో హల్చల్  చేసింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

ఆస్పత్రి వర్గాలు చనిపోయిన బిడ్డను పాతిపెట్టేయాలని కొందరికి పని అప్పగించారు. వారు గొయ్యి తవ్వుతుండగా బిడ్డ కదలడం చూసి ఆశ్చర్యపోయారు. . ఏం చేయాలో తెలీని స్థితిలో అలాగే ఉండిపోయారు. ఆ కాసేపు పెనుగులాట తర్వాత బిడ్డ కూడా కదలడం మానేసింది. దీంతో వారు కూడా చేసేదేమీ లేక చనిపోయిందని నిర్ధారించుకుని పూడ్చిపెట్టారు. ఈ విషయం  బయటకు తెలియడంతో స్థానికులంతా ఆస్పత్రి తీరుపై మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు