పెళ్లింట్లో అసభ్య ప్రవర్తన, హిజ్రాల అరెస్టు

27 Dec, 2020 11:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన హిజ్రాలు వారికి సహకరించిన ఆటో డ్రైవర్లను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్‌
ఆర్‌.కె.లేఅవుట్‌కు చెందిన ప్రేవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈనెల 24న తన కుమారుడి వివాహం జరిపించాడు. 25న ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసే క్రమంలో 8 మంది హిజ్రాలు ఆయన ఇంటికి వచ్చి రూ.20 వేలు డబ్బులు డిమాండ్‌ చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. భయపడిన చలపతి కుటుబ సభ్యులు వారికి రూ.16,500 ఇవ్వడంతో వెళ్లిపోయారు.

ఈ విషయంపై బాధితుడు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు ప్రగతినగర్‌ ఎలీప్‌ చౌరస్తాలో టీఎస్‌15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్త, మొహమ్మద్‌ మాసీలను అరెస్టు చేశారు. ఈ విషయమై మాదాపూర్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమాయకులను వేధించే ట్రాన్స్‌జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని, లేదా వాట్సాప్‌ నెంబర్‌ 94906 17444కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు