శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ కాల్చివేత

16 Oct, 2020 15:16 IST|Sakshi

ఉగ్రవాదులపై పోరులో  ఎనలేని ధైర్యసాహసాలు

అనేకసార్లు తప్పించుకున్న బల్విందర్ సింగ్ 

చివరికి మాటువేసి మట్టుపెట్టిన ఉగ్రవాదులు

చండీగఢ్: శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్విందర్ సింగ్ (62)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని తారన్ తరణ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా  కలకలం రేపింది.  

రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనపై గతంలోకూడా అనేకసార్లు ఉగ్రవాదులు ఎటాక్ చేశారని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం బల్విందర్ భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబం మొత్తం ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉందని బల్విందర్ సింగ్ సోదరుడు రంజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన బల్విందర్ సింగ్ కు 1993లో రక్షణ మంత్రిత్వ శాఖ శౌర్యచక్ర పురస్కారం లభించింది. అంతర్జాతీయ మీడియాను కూడా ఆయన ధైర్యసాహసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తోపాటు అనేక డాక్యుమెంటరీలు ఆయనపై రూపొందాయి.

మరిన్ని వార్తలు