సాక్షి, బనశంకరి: బెంగళూరు జేపీ నగర్లో ఒకే ఇంట్లో ఉన్న పశ్చిమబెంగాల్కు చెందిన 71 ఏళ్ల వృద్ధురాలు మమతా బసు, ఒడిశా వాసి అయిన లెక్చరర్ దేవరద్ బెహరా (41) హత్యకు గురయ్యారు. పుట్టేనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని సంతృప్తి నగరలోని ఓ ఇంట్లో ఈ హత్యలు జరిగాయి. మమతాబసు కుమార్తె విదేశాల్లో ఉంటుంది. లెక్చరర్ అయిన ఈమె కొడుకు దేవదీపబసు పక్క వీధిలో విడిగా ఉంటున్నారు. తన ఇంట్లో మమత ఒంటరిగా ఉంటున్నారు. 25 రోజుల క్రితం ఈ కుటుంబానికి స్నేహితుడైన ఒడిశా వాసి దేవరద్ బెహరా వచ్చి ప్రైవేట్ లెక్చరర్గా చేస్తూ మమత ఇంట్లో ఉంటున్నారు.
బుధవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు మొదటి అంతస్తులో నిద్రిస్తున్న వృద్ధురాలిని చాకుతో పొడిచి చంపారు. కింది అంతస్తులో నిద్రిస్తున్న దేవరద్నూ అదేతరహాలో హత్య చేసి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్, నగలు, నగదుతో పారిపోయారని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. మమత కొడుకు ఇంటికి చేరుకుని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.