సిద్దిఖ్‌ను చంపి, అతని భార్యకు వీడియో కాల్‌

4 Apr, 2021 11:39 IST|Sakshi

బంజారాహిల్స్‌ హత్యకేసులో కొత్తకోణం!  

కమాన్‌ కట్టతో చంపేశాడు..?

వీడియో కాల్‌ చేసి మృతుడి భార్యకు చూపాడు..!

బంజారాహిల్స్‌: కార్మికనగర్‌లో జరిగిన టైలర్‌ మహమ్మద్‌ సిద్దిఖ్‌ అహ్మద్‌ హత్య కేసులో రోజుకో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. సిద్దిఖ్‌ను హత్య చేసినట్లుగా భావిస్తున్న అలీ కమాన్‌ కట్టతో హతమార్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హత్య అనంతరం సిద్దిఖ్‌ మృతదేహాన్ని అతని భార్య రుబీనాకు వీడియో కాల్‌ ద్వారా చూపినట్లు సమాచారం. గత నెల 30న అర్ధరాత్రి సమయంలో సిద్దిఖ్‌ ఇంట్లోకి ప్రవేశించిన అలీ అతన్ని కమాన్‌కట్టతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సిద్దిఖ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నేపథ్యంలోనే మృతదేహాన్ని మాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు.

విఫలం కావడంతో మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టడానికి యత్నించగా అది కూడా విఫలమైంది. దీంతో అలీ అదే సమయంలో సిద్దిఖ్‌ భార్య రుబీనాకు వీడియో కాల్‌ చేసి చూపినట్లు తెలుస్తుంది. అనంతరం  కమాన్‌ కట్టతోపాటు రక్తాన్ని శుభ్రం చేసిన దుస్తులను తీసుకొని సంచిలో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లే క్రమంలో పారేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో తెలియజేసినట్లు సమాచారం. అయితే నిందితుడు ఉపయోగించిన మారుణాయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు మిగిలిన వ్యవహారంపై తేల్చేందుకు నిందితుడిని పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.

చదవండి: ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం

మరిన్ని వార్తలు