నీట్‌గా స్కెచ్‌ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి

20 Mar, 2023 13:47 IST|Sakshi

అన్నానగర్‌(చెన్నై): నకిలీ పత్రాలతో బ్యాంకులో రూ.1.28 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన ప్రైవేట్‌ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ లోన్‌ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి రుణం ఇస్తున్నారు. 2019–20 వరకు కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్‌ మేనేజర్‌గా ఉన్న మార్టిన్‌ సాకో, విజయకుమార్‌ కంపెనీలో పని చేస్తున్నట్లు 44 మందికి నకిలీ పత్రాలు సిద్ధం చేసి రూ.1.28 కోట్ల రుణం పొందారు.

బ్యాంకు ఆడిట్‌లో నకిలీ పత్రాలతో రుణం తీసుకున్నట్టు తేలింది. దీంతో మండల మేనేజర్‌ సెంథిల్‌కుమార్‌ కొబయాషి మునిసిపల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్‌ మేనేజర్‌ దండపాణి, జయప్రకాష్‌ నారాయణన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రాధిక, ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్‌ మేనేజర్‌గా పని చేసిన మార్టిన్‌ సాకో, విజయకుమార్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్‌ తదితరులను అరెస్టు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్‌ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను ఊటీలో ఉన్నట్లు సమాచారం అందగా అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు