బేగంబజార్‌ పరువు హత్య: సంజన తల్లి ముందుగానే హెచ్చరించినా.. నీరజ్‌ పట్టించుకోలేదు!

23 May, 2022 10:00 IST|Sakshi

హైదరాబాద్‌:  నగరంలోని బేగం బజార్‌లో.. పరువు హత్యకు గురైన నీరజ్‌ పర్వాన్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు అంశాలు వెలుగు చూశాయి. సంజన తల్లి నీరజ్‌-సంజనలను ముందుగానే హెచ్చరించినా.. వాళ్లు వినకపోవడం, తదనంతర పరిణామాలు సంజన బంధువుల్లో నీరజ్‌ పట‍్ల మరింత విద్వేషాన్ని రగిల్చిందని తెలుస్తోంది. 

కులాంతర వివాహం కావడంతో పరువు పోయి ఆ అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టినతర్వాత యాదవ అహీర్‌ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాదవ్‌ సమాజ్‌లోని కార్యక్రమాలకు సైతం సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో ఆ కుటుంబం రగిలిపోయిందట.

పైగా తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. ఎక్కడికి వెళ్లినా అవమానపడ్డ సంజన కుటుంబ సభ్యులు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే అంతుకు ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకుంది. 

ఈ క్రమంలో.. బాబు పుట్టాక తన తల్లితో సంజన మాట్లాడింది. ఆ సమయంలో.. ఎట్టిపరిస్థితుల్లో బేగం బజార్‌కు రావొద్దని సంజన తల్లి ఆ జంటను హెచ్చరించినట్లు రిపోర్ట్‌లో ఉంది. అయితే ఆమె హెచ్చరికలను లెక్క చేయని ఆ జంట.. బేగం బజార్‌లోనే ఉంది. దీంతో ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు నిందితులు. గురువారం జుమేరాత్‌ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్నారు. ఘటనకు ముందు పీకలదాకా మద్యం సేవించారు.  శుక్రవారం రాత్రి నీరజ్‌ కోసం ఓ బాలుడితో రెక్కీ చేశారు. ఆ సమయంలో తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్‌ కంట్లో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి హతమార్చారు.

చదవండి: నా అత్తమామలకు కూడా ప్రాణహాని ఉంది-నీరజ్‌ భార్య

మరిన్ని వార్తలు