ఆమె లేని లోకం శూన్యమని.. కుటుంబం మొత్తం..

1 Jul, 2021 14:09 IST|Sakshi

మే లో కోవిడ్‌తో మహిళ మృతి  

విరక్తితో భర్త, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య  

ఆనేకల్‌ వద్ద ఘోరం

బొమ్మనహళ్లి/కర్ణాటక: కరోనా నిత్యం విషాదం నింపుతోంది. కోవిడ్‌తో భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త, ఇద్దరు కూతుళ్లు ఉరి వేసుకున్నారు. ఈ ఘోరం బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకా అత్తిబెలిలో చోటుచేసుకుంది. మృతులు అత్తిబెలిలోని అంబేడ్కర్‌ లేఔట్‌లో నివసించే సతీష్‌ (45), ఆయన కుమార్తెలు కీర్తి (18), మోనిషా (15). సతీష్‌ ప్రైవేటు ఉద్యోగి కాగా కీర్తి బీఎస్సీ, మోనిషా 9వ తరగతి చదువుతున్నారు. సతీష్‌ భార్య ఆశా కరోనాకు గురై మే నెల 6న ప్రాణాలు విడిచింది.  

ఆమె జ్ఞాపకాలతో జీవితం..  
జీవన సమరంలో తోడునీడగా ఉన్న భార్య మరణంతో సతీష్, పిల్లలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అప్పటినుంచి ఆమె జ్ఞాపకాలతో రోజులు నెట్టుకొస్తున్నారు. చివరికి జీవితం మీద విరక్తి చెంది అఘాయిత్యానికి ఒడిగట్టారు. బుధవారం ఉదయం ఎంత పొద్దుపోయినా ఇంటిలో నుంచి ఎవరు బయటకి రాకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు తీసి చూడగా తండ్రీ బిడ్డలు ఉరికి వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను కిందికి దించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  
 

మరిన్ని వార్తలు