Bangalore Flyover Accident: అదే వంతెనపై మరో ఘోరం

28 Sep, 2021 06:52 IST|Sakshi

బైక్‌ను ఢీకొన్న సిటీ బస్‌  

టెక్కీ జంట దుర్మరణం  

బొమ్మనహళ్లి(బెంగళూరు): సుమారు నెల కిందట బెంగళూరులోని బొమ్మనహళ్లి– ఎలక్ట్రానిక్‌ సిటీ వంతెన పైన నిలిపి ఉన్న బుల్లెట్‌ బైక్‌ను కారు ఢీకొని టెక్కీ జంట కిందకు పడి దుర్మరణం పాలైన సంగతి మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ఇదే వంతెనపై ఆదివారం రాత్రి బీఎంటీసీ బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ప్రభాకర్‌ (25) అతని స్నేహితురాలు సహాన (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులు ఇద్దరూ దావణగెరెకు చెందినవారు కాగా బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ బైక్‌ మీద ఎలక్ట్రానిక్‌ సిటీ మొదటి స్టేజ్‌ నుంచి రెండవ స్టేజ్‌కు వెళ్లడానికి వంతెన మీద ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వెనుక ఉంచి వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టగా ఇద్దరూ కిందపడిపోయారు. వారిపై బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలతో క్షణాల్లో మృతి చెందారు.  

ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు వచ్చి మృతదేహాలను అక్కడి నుంచి తరలించి కేసు నమోదు చేశారు.  నిర్లక్ష్యంగా బస్సు నడిపిన బీఎంటీసీ బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వంతెన పైన బైక్‌ను యూటర్న్‌ చేస్తున్న సమయంలో బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ వంతెనపై యాక్సిడెంట్లలో టెక్కీ జంటలు మరణిస్తుండడం నగరంలో కలకలం రేపుతోంది.

చదవండి: VIDEO: ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది

మరిన్ని వార్తలు