ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి

9 Apr, 2021 20:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బిహార్‌లో వెలుగు చూసిన దారుణం

పట్నా: మరి కొద్ది రోజుల్లో వివాహం చేసుకుని నూతన జీవితం ఆరంభించబోతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి కలలు కంటూ ఊహల్లో తేలిపోతున్న ఆ యువతి.. అమానుష రీతిలో హత్యకు గురైంది. దుండుగులు కాళ్లు, చేతులు కట్టేసి.. యువతి తల నరికి అత్యంత కిరాతకంగా హతమర్చారు. పెళ్లి కళ ఉట్టిపడాల్సిన ఆ ఇంట్లో ప్రస్తుతం విషాదం రాజ్యమేలుతుంది. ఇక యువతి మరణానికి వరుడి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బిహార్లో వెలుగు చూసిన ఈ దారుణం వివరాలు...

నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన యువతి(19)కి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు సరస్వతి పూజా సమయంలో వధువు కుటుంబం వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా ముట్టజెప్పారు. మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వధువుని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు.

యువతి కాళ్లు, చేతులు కట్టేసి ఆమె తల నరికి కిరాతకంగా చంపేశారు. తల లేని యువతి శవం చూసి స్థానికులు హడలిపోయారు. సమాచారం అందుకున్న తార్థారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. వరుడి లవ్ ఎఫైర్ కారణంగానే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆజాద్ గతంలోనే మరో యువతితో ప్రేమాయనం నడిపాడని.. ఆమె బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయారు.

చదవండి: 'చేదు నిజాలు తెలిశాయి, అతడితో నా పెళ్లి జరగదు'‌

మరిన్ని వార్తలు