విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్‌

6 Aug, 2021 08:27 IST|Sakshi

యానాం: ఆనందంగా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్‌ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్‌ బైక్‌ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. గురువారం కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్‌లో బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు.

మార్గమధ్యలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్‌ బైక్‌ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్‌ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్‌కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. యానాం ట్రాఫిక్‌ ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు