తాళం వస్తే.. చోరీ పక్కా!

11 Aug, 2020 07:32 IST|Sakshi

ఇలా 12 బైకుల దొంతనం 

వీటిని బీదర్‌ అమ్మేందుకు పథకం 

పోలీసులకు చిక్కిన ముగ్గురు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇడియట్‌’ సినిమాలో కమెడియన్‌ అలీ దొంగలించిన బైక్‌లను చాకచక్యంగా ఎత్తుకెళ్తాడు. మార్గంమధ్యలో అడ్డగించిన పోలీసులు ఆ బైక్‌పై ఉన్న ఇసుకను మాత్రమే చూస్తారు కానీ.. బైక్‌ వివరాలు మాత్రం అడగరు. సరిగ్గా ఇదే తరహాలో ముగ్గురు దొంగలు ఇలాగే దొంగలించిన బైక్‌లను ఎత్తికెళ్లిపోదామనే పన్నాగం పన్ని పోలీసులకు చిక్కారు. ఆసీఫ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఇటీవల చోరీకి గురైన బైక్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. ముగ్గురు దొంగలు దొరికారని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం మీడియాకు వెల్లడించారు. రికవరీ చేసిన 12 ద్విచక్రవాహనాలను, ముగ్గురు నిందితులు ఎం.వెంకటేష్‌(22), వశీం అక్రమ అలియాస్‌ వసీం(27), సిరాజ్‌ఖాన్‌(28)లను సోమవారం మీడియాకు చూపించారు.

కమిషనర్‌ తెలిపిన వివరాల ప్రకారం... దహిల్‌బాగ్‌ మహబూబ్‌ కాలనీకి చెందిన పాతనేరస్తుడు ఎం.వెంకటేష్‌ ఆసీఫ్‌నగర్‌లోని ఓ పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్నాడు. ఇతనిపై 12కు పైగా బైక్‌ చోరీ కేసులున్నాయి. కొద్దిరోజులు క్రితం బీదర్‌కు చెందిన వశీం అక్రం, సిరాజ్‌ ఖాన్‌లతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లొచ్చిన వెంకటేష్‌.. వసీం, సిరాజ్‌ఖాన్‌లతో కలిసి బైక్‌ల చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో తన వద్ద ఉన్న  తాళాలతో పార్క్‌ చేసిన ఉన్న బైక్‌ తాళాలను వెంకటేష్‌ ఓపెన్‌ చేయడానికి యత్నిస్తాడు.  తాళం వేస్తే ఈ విషయాన్ని వసీం అక్రం, సిరాజ్‌ఖాన్‌లకు సమాచారం ఇస్తాడు. వారు వచ్చి ఆ బైక్‌లను వేరే ప్రాంతాల్లోని పార్కింగ్‌ ప్రదేశాల్లో పార్క్‌ చేస్తారు. నగరంలో అమ్మితే  సమస్యలు వస్తాయని వేరే ప్రాంతాల్లో అమ్మేందుకు సిద్ధపడ్డారు. 

ఇలా పట్టేశారు... 
‘ఇడియట్‌’ సినిమాలో అలీ ఏ విధంగా అయితే బైక్‌లను దొంగలించి ఆ బైక్‌లపై బీదర్‌కు ఇసుకను తరలిస్తూ.. పోలీసులకు చిక్కినట్టే.. వీరు కూడా ఇసుక బస్తాలను దొంగలించిన బైక్‌లపై పెట్టుకుని బీదర్‌ వెళ్లి అమ్మాలని పథకం వేశారు. అయితే..పోలీసులు ఫొటో అండ్‌ ఎనాస్‌మెంట్‌ ద్వారా వీరిని పట్టుకున్నారని కమిషనర్‌ తెలిపారు.  

వెంకటేష్‌పై పలు ఠాణాల్లో కేసులు 
వెంకటేష్‌ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. అతను సాధారంగా చేసేదంతా చోరీలే. ఇలా 2014 నుంచి చోరీలు చేస్తున్నాడు. వెంకటేష్‌పై మంగళ్‌హట్‌ పీఎస్‌లో 4 కేసులు, ఆసీఫ్‌నగర్‌ పీఎస్‌లో 3 కేసులు, రాయదుర్గం పీఎస్‌లో 2 కేసులు, లంగర్‌హౌస్, టప్పచబుత్ర పీఎస్‌ల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దొంగలించిన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కాగా.. 12 బైక్స్‌లో 11 బైక్‌ల సమాచారం మాత్రమే ఉంది. మరో బైక్‌ ఎక్కడ కొట్టేసింది స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు