బీజేపీ నేతకు టోకరా.. ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని రూ.50 లక్షలు మోసం 

21 Nov, 2021 08:58 IST|Sakshi

కేంద్ర మంత్రి మాజీ సహాయకుడి అరెస్ట్‌ 

తిరువొత్తియూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తీసిస్తామని బీజేపీ నేత వద్ద రూ.50 లక్షలు తీసుకుని మోసం చేసిన కేంద్ర మంత్రి మాజీ సహాయకుడు నరోత్తమన్, అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి జయలక్ష్మినగర్‌కు చెందిన బీజేపీ నేత భువనేష్‌ కుమార్‌ (29) చెన్నై పాండిబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జూలైలో ఓ ఫిర్యాదు చేశారు.

అందులోని వివరాల మేరకు.. “మా చిన్నాన్న కుమార్తె వసంతికి ఆరణి టికెట్‌ కోసం పెరంబూరుకు చెందిన విజయరాఘవన్‌ సంప్రదించాం. అతని ద్వారా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయకుడు నరోత్తమన్‌ను కలిశాం. అతను ఎమ్మెల్యే టికెట్‌ తీసివ్వడానికి రూ.కోటి ఇవ్వాలని కోరారు. తొలుత రూ.50 లక్షలు ఇవ్వాలని.. అభ్యర్థుల జాబితా వచ్చిన తర్వాత మిగిలిన రూ.50 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. దీంతో నగదు ఇచ్చాను. జాబితాలో పేరు లేకపోవడంతో నగదు తిరిగి ఇవ్వమని కోరినా పట్టించుకోలేదు.

ఈ వ్యవహారంలో నరోత్తమన్‌తో పాటు అతని తండ్రి చిట్టిబాబు, విజయరాఘవన్‌పై చర్యలు తీసుకుని నగదు ఇప్పించాలని’ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నరోత్తమన్‌ను తొలగించారు. పాండిబజార్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని నరోత్తమన్, చిట్టబాబును అరెస్టు చేసి శనివారం చెన్నైకి తీసుకొచ్చారు.    
 

మరిన్ని వార్తలు