మంత్రాలు చేస్తున్నాడని.. కర్రలతో దాడిచేసి, గొంతునులిమి..

23 Jul, 2021 08:05 IST|Sakshi

సాక్షి, కౌటాల(నిర్మల్‌): ఈ నెల 12న మండలంలోని మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన తోరే హన్మంతును మంత్రాల నెపంతో హత్య చేశారని సీఐ బుద్దేస్వామి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మొగడ్‌దగడ్‌ గ్రామానికి చెందిన బోయర్‌ కాశీనాథ్‌ తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. హన్మంతు మంత్రాలు చేయడంతోనే అనారోగ్యానికి గురయ్యారని కాశీనాథ్‌ తన బావ చౌదరి మారుతికి చెప్పాడు.

తన బావమరిది కుటుంబం ఇబ్బందికి కారణంగా మారుతున్న హన్మంతును ఎలాగైన చంపాలని మారుతి ప్లాన్‌ వేశాడు. ఈ నెల 12న హన్మంతును మారుతి, కాశీనాథ్‌ గ్రామ శివారులోని చెరువు వద్ద కర్రలతో దాడిచేసి, గొంతునులిమి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి పారిపోయారు. ఈ నెల 14న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మంత్రాల నెపంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రజలు మూఢనమ్మకాలు వీడాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో ఎస్సై ఆంజనేయులు, ట్రైనింగ్‌ ఎస్సై మనోహర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు