అర్నబ్‌కు దక్కని ఊరట

7 Nov, 2020 04:31 IST|Sakshi

ముంబై: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్‌ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్‌ అన్వయ్‌ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

మరిన్ని వార్తలు