కన్న కొడుకును హత్య: తల్లితో పాటు, ప్రియుడి అరెస్టు

12 Jun, 2021 11:58 IST|Sakshi

జీడిమెట్ల: ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కన్న కొడుకును కొట్టి చంపిన కేసులో బాలుడి తల్లితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. చింతల్‌ భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన కంజెర్ల ఉదయ(24), సురేష్‌ భార్యాభర్తలు. వీరికి కుమారుడు ఉమేష్‌(3) ఉన్నాడు. కాగా ఉదయ జగద్గిరిగుట్టకు చెందిన సెంట్రింగ్‌ మేస్త్రీ భాస్కర్‌(26)తో చనువుగా ఉండసాగింది.

భార్య ఉదయలో తేడాను గమనించిన సురేష్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఉదయ సంవత్సరం నుంచి భర్త సురేష్‌తో గొడవపడి చింతల్‌ మారుతీనగర్‌లో అద్దె గదిలో భాస్కర్‌తో కలిసి ఉంటుంది. ఈ నెల 8వ తేదీన ఉదయ ప్రియుడు భాస్కర్‌తో కలిసి కుమారుడు ఉమేష్‌ను తీవ్రంగా కొట్టింది. దెబ్బలకు తాళలేక ఉమేష్‌ ఇంట్లోనే మృతిచెందాడు.

దీంతో కంగారుపడిన ఉదయ, భాస్కర్‌లు ఉమేష్‌ను చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు బాలుడు ఉమేష్‌ అప్పటికే మృతిచెందినట్లు తెలిపి అతడి ఒంటిపై దెబ్బలు అనుమానంగా ఉండటంతో అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ, భాస్కర్‌లను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
చదవండి: ‘న్యూడ్‌ కాల్‌ చేస్తావా.. ఫొటోస్‌ అప్‌లోడ్‌ చేయలా?’

మరిన్ని వార్తలు