భోపాల్ : రెండు వేల రూపాయల విషయంలో చోటుచేసుకున్న గొడవలో ఓ మైనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు వ్యక్తులు అతడ్ని విచక్షణా రహితంగా కొట్టి.. అమానుషంగా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం జబల్పూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్కు అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులతో 2 వేల రూపాయల విషయంలో గొడవైంది. ఈ నేపథ్యంలో వారు మైనర్ను నయాగావ్ ఏరియాలోని పొలంలోకి తీసుకెళ్లారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టారు. బూట్లు నాకించారు. బలవంతంగా సిగరెట్ కూడా తాగించారు.
కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మైనర్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రోజున మైనర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.