డెత్‌ గేమ్‌.. ఆపై కిడ్నాప్‌ డ్రామా

27 Oct, 2020 02:42 IST|Sakshi
అథియాన్‌ ఫైల్‌ ఫొటో ,  సంఘటన స్థలంలో బాలుడి పుర్రె, ఎముకలు

హైదరాబాద్‌ శివార్లలో బిహారీ మైనర్‌ దుశ్చర్య

ఐదేళ్ల బాలుడితో కిక్‌ జంపింగ్స్‌ ‘షేర్‌చాట్‌’ వీడియో చిత్రీకరణ

కిందపడి తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. భయంతో చంపేసిన మైనర్‌

మృతదేహాన్ని ఔటర్‌పై పడేసి కిడ్నాప్‌ నాటకం.. డబ్బు డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌/శామీర్‌పేట్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చిన్నారి దీక్షిత్‌రెడ్డి హత్యో దంతం మరువకముందే నగర శివా ర్లలో మరో ఘోరం.. కిక్‌ జంపింగ్స్‌ వీడియో చిత్రీకరణలో గాయపడిన బాలుడిని.. భయంతో హత మార్చాడు బిహార్‌కు చెందిన మైనర్‌. మృతదేహాన్ని మూటగట్టి ఔటర్‌ రింగ్‌రోడ్‌ సమీ పంలో పడేశాడు. ఆపై కిడ్నాప్‌ డ్రామా ఆడుతూ డబ్బు డిమాండ్‌ చేశాడు. ఈ దారుణానికి ఒడి గట్టిన మైనర్‌ను శామీర్‌పేట పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ ఏవీ ఆర్‌ నర్సింహారావు, స్థానికుల కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ యూసుఫ్‌.. భార్య గౌసియా బేగం, పిల్లలు అదిభీ, రహాన్, ఫర్హాన్, అథియాన్‌ (5)తో కలిసి చాంద్‌ పాషాకు చెందిన ఇంటి కింది పోర్షన్‌లో నివసిస్తున్నాడు. పై పోర్షన్‌లో బిహార్‌కు చెందిన మైనర్‌ (17).. రాజు అనే స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. కింది పోర్షన్‌లో ఉండే అథియాన్‌తో పరిచయం పెంచు కున్నాడు. షేర్‌చాట్‌ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసే అలవాటున్న బిహారీ మైనర్‌.. అ«థియాన్‌తో ఒక వీడియో రూపొందించాలని భావించాడు.

ఇదీ జరిగిన ఘోరం..
ఈ నెల 15న ఉదయం 10 గంటలకు తన రూమ్మేట్‌ బయటకు వెళ్లిపోగా, 10.40 ప్రాంతం లో ఇంటి బయట ఆడుకుంటున్న అథి యాన్‌ను బిహారీ మైనర్‌ పైకి తీసుకెళ్లాడు. గాల్లోకి ఎగిరి చేసే కిక్‌ జంపింగ్స్‌  గురించి అథియాన్‌కు వివరించి.. అలా చేయాలని, తాను వీడియో తీసి షేర్‌చాట్‌లో పెడతానని చెప్పాడు. ఈ ప్రయ త్నంలో గాల్లోకి ఎగిరిన అథియాన్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. ఇది తెలిస్తే అతడి తల్లిదండ్రులు తనకు కొడతారని భయపడిన బిహారీ మైనర్‌.. గుట్టు రట్టుకాకుండా ఉండేందుకు అథియాన్‌ నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. గదిలో ఉన్న సెల్లో టేపుతో అథియాన్‌ కాళ్లు, చేతులు దగ్గరగా చేసి అతికించేశాడు. మృతదేహాన్ని ముందుకు వంచుతూ మధ్యలోకి మడతపెట్టి తన గదిలోని లగేజ్‌ బ్యాగ్‌లో కుక్కేశాడు. ఉదయం 11.30 సమయంలో బ్యాగ్‌తో నేరుగా శామీర్‌పేట్‌ చౌరస్తాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి షేర్‌ ఆటోలో ఓఆర్‌ఆర్‌ వరకు వెళ్లి, దొంగలమైసమ్మ చౌరస్తా సమీపంలోని ఔటర్‌  సర్వీసు రోడ్డులో ఉన్న చెట్ల పొదల్లో రాళ్ల మధ్య అథియాన్‌ మృతదేహాన్ని పడేశాడు. తిరిగొస్తూ తన స్నేహితుడి వద్ద రూ.200 అప్పుగా తీసుకుని గజ్వేల్‌ చేరుకున్నాడు. అక్కడ పని కోసం ప్రయత్నించి విఫలమై తిరిగి తన గదికి వచ్చేశాడు.

యజమాని మాటలతో దుర్బుద్ధి పుట్టి...
ఆడుకుంటానని వెళ్లిన అథియాన్‌ కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ సమయంలో భారీ వర్షాలకు నాలాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఏదైనా నాలాలో అథియాన్‌ పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు గాలింపు చేపట్టారు. మరోపక్క బిహారీ మైనర్‌ ఏం తెలియనట్టు అథియాన్‌ కుటుంబీకులతో సన్నిహితంగా మెలిగాడు. ఈనెల 20న అథియాన్‌ ఇంటి వద్ద గాలింపు చర్యల్లో పాల్గొంటున్న వారంతా కూర్చున్నారు. అథియాన్‌ ఫొటోతో పోస్టర్లు ముద్రించి సోషల్‌ మీడియాలో, ఇతరత్రా ప్రచారం చేద్దామని, ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు బహుమతి ప్రకటిద్దామని ఒకరు సలహానిచ్చారు. దీనిపై స్పందించిన ఇంటి యజమాని చాంద్‌ పాషా.. ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు కాదని, లక్ష రూపాయలు తానే ఇస్తానని చెప్పాడు. ఈ మాటలు విన్న బిహారీ మైనర్‌కు దుర్బుద్ధి పుట్టింది.

రూమ్మేట్‌ సెల్‌ఫోన్‌ అపహరించి..
అదే సందర్భంలో మానుకోటలో జరిగిన దీక్షిత్‌రెడ్డి హత్యోదంతమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో మాదిరే డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు కొత్త నాటకానికి తెరలేపి, అందినకాడికి దండుకోవాలని, ఆ డబ్బుతో స్వరాష్ట్రానికి పారిపోవాలని బిహారీ మైనర్‌ పథకం వేశాడు. తన ఫోన్‌ వాడితే చిక్కుతాననే ఉద్దేశంతో ఈ నెల 21న తన రూమ్మేట్‌ సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ వేర్వేరుగా చోరీ చేశాడు. దాంతో ఈనెల 24న చాంద్‌పాషాకు ఫోన్‌చేసిన బిహారీ మైనర్‌.. బాలుడిని తామే కిడ్నాప్‌ చేశామని, రూ.15 లక్షలిస్తే వదిలిపెడతామని బెదిరించాడు. అప్రమత్తమైన చాంద్‌పాషా, అథియాన్‌ కుటుంబీకులు శామీర్‌పేట పోలీసులకు చెప్పారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఆరాతీసిన అధికారులు సోమవారం ఓఆర్‌ఆర్‌ సమీపంలోని దాబాలో పనిచేస్తున్న రాజును పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బిహారీ మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యతో రాజుకు సంబంధం లేదంటూ జరిగినదంతా బయటపెట్టిన అతగాడు నేరాన్ని అంగీకరించాడు. బాలుడి మృతదేహం పడేసిన ప్రాంతానికి బిహారీ మైనర్‌ను తీసుకెళ్లిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయి, అస్తిపంజరంగా మారుతున్న స్థితిలో ఉన్న శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్‌ ౖవైద్యులతో అక్కడే పోస్టుమార్టం పూర్తిచేయించి కుటుంబీకులకు అప్పగించారు. గట్టి బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. బిహారీ మైనర్‌ను అరెస్టుచేసి జువైనల్‌ కోర్టుకు తరలించారు.

మరిన్ని వార్తలు