రెండెళ్ల ప్రేమ.. పాయిజన్‌ తాగిన యువకుడు..

29 Oct, 2021 10:33 IST|Sakshi
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న గణేశ్‌ తల్లి స్వరూప, బంధువులు

సాక్షి, కొత్తగూడెంటౌన్‌ (ఖమ్మం): ప్రేమించిన అమ్మాయి దూరమైందని, అమ్మాయి తరఫువారు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు పాయిజన్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెం పెనగడప గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్‌ గ్రామానికి చెందిన ఏసుపాక గణేశ్‌ (22) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబ సభ్యులను అడుగగా వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన గణేశ్‌ పాయిజన్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్‌ తల్లి స్వరూప ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల కిందట గణేశ్‌.. సదరు అమ్మాయి ప్రేమించుకున్నారని, పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు మాట ఇచ్చి తప్పారని చెప్పింది.

తన కుమారుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెళ్లి చేయమని చెప్పారని, ఊరిని వదిలిపోవాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్‌ బుధవారం రాత్రి పాయిజన్‌ తాగి పడిపోగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని, గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ గణేశ్‌ మృతిచెందాడని స్వరూప వెల్లడించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.  

చదవండి: Madhya Pradesh: డెయిరీ ముసుగులో వ్యభిచార దందా..

మరిన్ని వార్తలు