సెలవు కావడంతో సైకిల్‌ తీసుకుని బయటకు వెళ్లాడు.. అంతలో..

28 Sep, 2021 07:34 IST|Sakshi

టిప్పర్‌ ఢీకొని విద్యార్థి మృతి

సాక్షి,మద్దికెర( కర్నూలు): పెరవలి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, నరసయ్య దంపతులకు కురవ రంగస్వామి (13) ఒక్కగానొక్క కుమారుడు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం భారత్‌ బంద్‌ కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో గ్రామ శివారులో ఉన్న ఈద్గా వద్ద సైకిల్‌ తొక్కుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొంది.

తీవ్రంగా గాయపడిన రంగస్వామిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మమత సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌ రమేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామ సమీపంలో జరుగుతున్న రైల్వే పనులకు మట్టి, కంకర తరలించే టిప్పర్లు అతి వేగంగా వెళ్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

చదవండి: ఫేస్‌బుక్‌ ప్రేమ.. యువతి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు