అయిదో ఫ్లోర్‌ నుంచి పడి బాలుడు మృతి

31 Dec, 2020 07:54 IST|Sakshi
కృతిక నందా మృతదేహం

నేలరాలిన ఆశల దీపం

సాక్షి, తగరపువలస (భీమిలి): అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా మరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటి వరకూ లోకాన్ని మరిచిపోయి నిద్రపోయిన బాలుడు... ఆ నిద్రకళ్లతో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఈ లోకాన్ని వీడివెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా చింతాడకు చెందిన రావాడ జగదీశ్వరరావు దివీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా జీవీఎంసీ భీమిలి జోన్‌ సంగివలస శ్రీబాసర విద్యాసంస్థల వెనుక రాయల్‌ అపార్ట్‌మెంట్‌ అయిదో ఫ్లోర్‌లో భార్య, కుమారుడితో నివసిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కుమారుడు రావాడ కృతిక నందా(5) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయాడు. 2.30 గంటల సమయంలో మేల్కొని... నిద్ర కళ్లతో నడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు. అక్కడి నుంచి ప్రమాదవశాత్తూ కిందకు పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలైన నందాను సంగివలసలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ కళ్లెదుటే ఉన్న చిన్నారి అర్ధంతరంగా తమను విడిచిపోయాడని బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: మహిళతో సంబంధం: విద్యార్థి ఆత్మహత్య)

మరిన్ని వార్తలు