ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు!

14 Mar, 2021 13:51 IST|Sakshi

కొత్తగూడెం‌: ప్రేమపేరుతో తన కూతురిని శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని రైటర్‌బస్తీ గొల్లగూడేనికి చెందిన పాలవాయి నవీన్‌ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించానని చెప్పి, శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లి నవీన్‌ తల్లిదండ్రులను ప్రశ్నించగా, వారు వివాహానికి అంగీకరించారు. ఈ క్రమంలో కొద్ది నెలల్లోనే నవీన్‌ తండ్రి మృతి చెందాడు. అనంతరం నవీన్‌కు సింగరేణి ఉద్యోగం వచ్చింది. పెళ్లికి ముందుకు రాకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కానీ నవీన్‌ ఓ మైనర్‌ను వివాహం చేసుకున్నట్లు ఫొటోలు, శుభలేఖలు, మేజర్‌ అయినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి పోలీసులకు అందజేశాడు. కాగా ఆ బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఏఎస్పీని కలిసి సమస్య వివరించామని, నవీన్‌ మైనర్‌ను వివాహం చేసుకున్న విషయమై సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. పోలీసులు, వార్డు ప్రజాప్రతినిధి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఉన్నతాధికారులు స్పందించి తన కూతురికి న్యాయం చేయాలని కోరింది. 

చదవండి: చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య

మరిన్ని వార్తలు