ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..

17 Apr, 2021 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ యాదగిరి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్‌ టీఎన్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అశోక్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సింధే సుదీప్‌కుమార్‌ (18) ఉన్నారు. సుదీప్‌ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు.

కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఉండటంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ రోజూ అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఇదిలా ఉండగా, సుదీప్‌ బుధవారం రాత్రి హైటెక్‌ సిటీ హోటల్‌కు వెళ్దామని తన స్నేహితులను పట్టుపట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడపడ్డాడు. రాత్రి ఒంటి గంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు స్నేహితులతో ఫోన్‌లో చాట్‌ చేసిన సుదీప్‌ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్‌ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

( చదవండి: మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి..

మరిన్ని వార్తలు