‘ప్రియురాలి’ కోసం కొడుకుని చంపిన తల్లి

27 Nov, 2020 20:52 IST|Sakshi

బ‍్రసిలియా: బ్రెజిల్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం ఓ కసాయి తల్లి కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ భయంకరమైన సంఘటనలో 27 ఏళ్ల మహిళ, తన ప్రియురాలి సహాయంతో, తన తొమ్మిదేళ్ల కొడుకును పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి.. ఆపై బార్బెక్యూలో కాల్చింది. బాధితుడిని రువాన్ మేకాన్ డా సిల్వా కాస్ట్రోగా గుర్తించారు. ఈ ఏడాది మేలో చిన్నారిని, అతని తల్లి రోసానా ఆరి డా సిల్వా కాండిడో, ఆమె భాగస్వామి కాసిలా ప్రిస్సిలా శాంటియాగో డమాస్కేనో పెస్సోవాతో(28) కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి నవంబర్‌ 25న కోర్టు కాండిడోకు 65 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఆమెకు సాయం చేసినందుకు గాను పెసోవాకు 64 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (చదవండి: పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం)

ఈ ఏడాది మే 31 రాత్రి సమయంలో రువాస్‌ తన ఇంటిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో మహిళలిద్దరు బాలుడిపై దాడి చేశారు. కాండిడో అతని ఛాతీలో 11 సార్లు పొడిచింది. పెస్సోవా చిన్నారిని క్రిందికి పడేసింది. అనంతరం ఇద్దరు కలిసి బాలుడిని ముక్కలుగా కట్‌ చేసి.. బార్బెక్యూ గ్రిల్ మీద ఉంచి కాల్చేశారు. తరువాత వారు ఆ అవశేషాలను సూట్‌కేస్‌లో నింపి.. సమాంచాయియా ప్రాంతంలో‌ పడేస్తుండగా.. ఇద్దరు యువకులు వారిని గమనించారు. సాక్షులలో ఒకరు, ఉత్సుకతతో, సూట్‌కేస్‌ను తెరిచి చూసి.. దానిలో ఉన్న వాటిని చూసి జడుసుకున్నాడు. సూట్‌కేస్‌లో ఎముకలు వంటివి ఉండటంతో వెంటనే దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా ఇద్దరు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. రెండు రోజుల క్రితం కోర్టు వీరికి శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు